బిగ్‌స్క్రీన్‌పై గల్లీబాయ్‌

నిన్నామొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగిన ఓ గల్లీబాయ్‌కి బిగ్‌స్క్రీన్‌పై నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ప్లేబ్యాక్‌ సింగర్‌గా చిత్ర సీమకు పరిచయమైన ఈ కుర్రాడు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌–3 విజేతగా నిలిచాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. దాంతో నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్‌ స్టార్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ రాహుల్‌ను వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్రబిందువయ్యారు. పక్కా లోకల్‌ బాయ్‌గా అభిమానులకు దగ్గరైన రాహుల్‌కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి.


కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'రంగమార్తాండ' సినిమాలో అగ్రనటులు ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నిన్నటిదాకా బుల్లితెరపై సందడి చేసిన రాహుల్‌ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుని అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. స్వతహాగా గాయకుడైన ఇతడు ఇప్పుడు నటుడిగా మారుతుండటంతో అటు పాతబస్తీతో పాటు ఇటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్విట్టర్‌లోనూ ఇటు ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఆయన అభిమానులు ఈ ఆరందార్రి పంచుకుంటున్నారు. రెండురోజుల నుంచి రాహుల్‌ సోషల్‌ మీడియాలో మారుమోగిపోతున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌ లాంటి సీనియర్‌ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా రాహుల్‌ పేర్కొన్నాడు.